రాత్రంతా కాంగ్రెస్ నేతలతోనే భేటీ... తెల్లవారుజామున 5.30 గంటలకు ముగిసిన ప్రియాంక సమావేశం!
- యూపీలో విజయమే లక్ష్యంగా ప్రియాంక సమావేశం
- పలువురితో విడివిడిగా సమావేశాలు
- 16 గంటలు సాగిన చర్చలు
ఉత్తరప్రదేశ్ లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యంగా, ఆ పార్టీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం రాత్రంతా నేతలతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. ఈ తెల్లవారుజామున 5.30 గంటల వరకూ ఆమె పలువురు నేతలతో మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలోనే గడిపారు. దాదాపు 16 గంటల పాటు ఆమె పలువురు నేతలను కలిసి, ఎన్నికలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. జిల్లాల అధ్యక్షులు, ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆమె విడివిడిగా మాట్లాడారని, అమేథి, రాయ్ బరేలీ నుంచి వచ్చిన వారినీ కలిశారని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సమావేశం మొదలైందని పార్టీ వర్గాలు తెలిపాయి.